విడుదలకు సిద్ధమవుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి 'వేదవ్యాస్'

  • ముగింపు దశకు చేరిన ఎస్వీ కృష్ణారెడ్డి ‘వేదవ్యాస్’ చిత్రం
  • నిర్మాతగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి
  • సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సినిమా నిర్మాణం
  • హీరోగా పిడుగు విశ్వనాథ్, విదేశీ నటుల ప్రత్యేక పాత్రలు
  • త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు
ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'వేదవ్యాస్' చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణ కార్యక్రమాల్లో చివరి దశకు చేరుకుంది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, మాజీ శాసనసభ్యుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైందవ ధర్మ విశిష్టతను శాస్త్రీయ దృక్పథంతో వివరిస్తూ సాగే ఈ సకుటుంబ కథాచిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తన కొత్త నిర్మాణ సంస్థ 'సాయి ప్రగతి ఫిలిమ్స్' బ్యానర్‌ను ఫిలిం నగర్‌లోని సాయిబాబా ఆలయంలో శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, సమర్పకులు అచ్చిరెడ్డితో కలిసి ఆయన పంచకట్టులో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మంట్ కీలక పాత్రల్లో నటిస్తుండటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీరితో పాటు సాయికుమార్, సుమన్, బాబు మోహన్, అలీ, రఘుబాబు, అజయ్ ఘోష్ వంటి ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఎప్పటిలాగే ఈ చిత్రానికి కూడా కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, సంగీతం, దర్శకత్వం అనే ఐదు ప్రధాన బాధ్యతలను ఎస్వీ కృష్ణారెడ్డి స్వయంగా నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

SV Krishna Reddy
Vedavyas
New Movie
Sai Pragathi Films

More Telugu News